ఏపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తాం... దక్షిణ తెలంగాణకు అన్యాయం జరగనివ్వం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

  • కాంగ్రెస్ నేతలపై శ్రీనివాస్ గౌడ్ విమర్శనాస్త్రాలు
  • ఏపీ జీవోలపై సుప్రీంలో పిటిషన్ లు వేశామని వెల్లడి
  • చిత్తశుద్ధి ఉంటే ఇంప్లీడ్ అవ్వాలని విజ్ఞప్తి
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచినప్పుడు ఉత్తమ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నాడు పీజేఆర్ ఒక్కరే పోతిరెడ్డిపాడును వ్యతిరేకించారని, కనీసం ఆయనకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు.

నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కేంద్రం వద్దన్నా ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవడం వల్లే సుప్రీంకోర్టుకు వెళ్లామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఏపీ జీవోలు రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్ లు వేశామని, ఈ అంశంలో పెడర్థాలు తీయొద్దని హితవు పలికారు. ఏపీ ఎత్తులకు పైఎత్తులు వేసి దక్షిణ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉంటే తమ పిటిషన్ లో ఇంప్లీడ్ అవ్వాలని, కానీ రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తమకు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ అనే తేడా లేదని, తమకు తెలంగాణ అంతా ఒక్కటేనని ఉద్ఘాటించారు.

V Srinivas Goud
Uttam Kumar Reddy
Congress
Irrigation Projects
Telangana
Andhra Pradesh

More Telugu News